పేరు ఒకటే.. ర్యాంక్ మరొక్కరిది

27-04-2024 01:20:55 AM

వికారాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో ఇద్దరు అభ్యర్థులకు ఒకే పేరు ఉండటంతో పొరపాటుగా తానే సివిల్స్ సాధించాననుకున్నాడు. తీరా హాల్‌టికెట్ నంబర్‌ను సరి చూడగా అదే పేరు ఉన్న మరో అభ్యర్థి ఇతర రాష్ట్రానికి చెందిన అభ్యర్థి కావడంతో ఇతడు కంగుతిన్నాడు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్‌పల్లికి చెందిన తరుణ్‌కుమార్ యూపీఎస్సీ ఫలితాల్లో 231 ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైనట్లు ప్రచారం జరిగింది.

దీంతో నాయకులు, ప్రజా సంఘాలు తరుణ్ కుమార్‌ను ఘనంగా సన్మానించాయి. అయితే హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా తరుణ్ అనే పేరుమీద హర్యానాకు చెందిన యువకుడికి 231వ ర్యాంక్ వచ్చింది. ఫలితాలు వెలువడిన సమయం లో ఇంటి పేరు లేకపోవడం, ఒకే తరహా పేరు ఉన్న ఇద్దరు పరీక్షకు హాజరు కావడంతో పాటు, హాల్ టికెట్ నంబర్ సరిగ్గా గుర్తించక తానే ఎంపికైనట్లు తరుణ్ పొరపాటు పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్థారించుకునేందుకు ప్రయత్నించ గా యువకుడు గ్రామంలో అందుబాటులో లేడు. గ్రామస్తులను అడిగితే ఆ ర్యాంక్ సాధించింది హర్యానాకు చెందిన యువకుడని పేర్కొన్నారు.