13-09-2025 09:44:34 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): చైన్ స్నాచింగ్ కేసులో ఘట్ కేసర్ పోలీసులు శనివారం ఇద్దరిని రిమాండ్ కు తరలించారు. ఈనెల 9న ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంకుషాపూర్ కు చెందిన అర్ధ కాంతమ్మ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా గుర్తు తెలియని దుండగుడు ఆమె మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు అపహరించు కెళ్ళాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి ఏసిపి చక్రపాణి ఆధ్వర్యంలో ఘట్ కేసర్ సీఐ ఎం. బాలస్వామి, డిఐ శ్రీనివాస్ క్రైమ్ టీం బృందాలుగా ఏర్పడి 48 గంటలోనే దొంగలను పట్టుకున్నారు. 12న ఘనపూర్ సమీపంలో మళ్లీ దొంగతనానికి వచ్చిన నిందితులను సర్వీస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వివరాలను వెల్లడించారు
జనగామ జిల్లా, లింగాల ఘణపురంకు చెందిన కేవిడి గణేష్ (22), అన్నోజిగూడలో ఉంటూ దివ్యనగర్ లోని నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్నాడు. పార్ట్ టైం లో రాపిడో వాహనం నడుపుతాడు. జనగామ జిల్లా, లింగాల ఘణపుర్ మండలం, నేరుట్ల గ్రామానికి చెందిన రాగుల లక్ష్మణ్ (22) కూలి పని చేసుకుంటాడు. వీరిద్దరూ చిన్నప్పటినుంచి స్నేహితులు. లోన్ ఆప్ లకు బెట్టింగులకు, చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలను ఎంచుకున్నారు.
చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ లో వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడ్డారు. అందులో భాగంగానే ఈనెల తొమ్మిదిన అంశాపూర్ లో కాంతమ్మ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్ళారు. పుస్తెలతాడును జనగామలోని ముత్తూట్ ఫైనాన్స్ లో తనకా పెట్టి రూ. 2లక్షల 25 వేలు తీసుకున్నారు. ఇద్దరు డబ్బులు పంచుకోగా గణేష్ ఐఫోన్ కొనుగోలు చేసాడు. దొంగతనానికి వాడిన బైక్, ఐఫోన్, ముత్తూట్ కార్పొరేషన్ రిసిప్ట్ లను స్వాధీనం చేసుకుని, శనివారం మధ్యాహ్నం రిమాండ్ తరలించడం జరిగింది.