27-05-2025 12:00:00 AM
బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇప్పుడు తుపాన్ ముందు ప్రశాంతతలా ఉన్నాయి. తాత్కాలిక ప్రభుత్వానికి సలహాదారు హోదాలో ఉన్న మహమ్మద్ యూనుస్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. రేపో మాపో యూనుస్ రాజీనామా చేయనున్నారన్న వార్తలను పూర్వపక్షం చేస్తూ, ఆయన దిగిపోవడం లేదని, చేపట్టిన సంస్కరణలను పూర్తి చేస్తారని ఆయన సన్నిహితులు తేల్చి చెప్పారు.
డిసెంబర్ కల్లా దేశంలో ఎన్నికలు నిర్వహించాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దేశ సైనికాధిపతి వాకర్ ఉజ్ జమాన్ పదేపదే హెచ్చరిక ధోరణితో చెబుతున్నారు. అయితే, దేశాధ్యక్షుడిగా మారి బంగ్లాదేశ్కు తన కనుసన్నల్లో నడిచే ప్రభుత్వం ఉండాలనేది యూనుస్ కోరికని ఆయన గురించి తెలిసిన వారు చెపుతున్న మాట.
జూన్ నాటికి దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తారని, అప్పటి వరకు దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను చక్కదిద్దాల్సి ఉందని యూనుస్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయంతో ఆర్మీ చీఫ్ ఏకీభవించడం లేదు. సాధ్యమైనంత త్వరంగా ఎన్నికలు జరిపించాలన్న తమ డిమాండ్పై, యూనుస్కు మద్దతునిస్తున్న రాజకీయ పక్షాలు వీధి పోరాటానికి దిగితే సహించేది లేదని కూడా ఆర్మీ చీఫ్ గట్టిగానే చెపుతున్నారు.
యూనుస్ను గద్దె దించేందుకు ఆర్మీ అన్ని అవకాశాలను శోధిస్తున్నదనే వార్తలు కూడా వస్తున్నాయి. దేశంలో అల్లర్లు చెలరేగి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి రాజ్యాంగ బద్ధత లేదని ఆర్మీ భావిస్తున్నది. గత ప్రభుత్వం రద్దయిన తర్వాత 90 రోజుల్లోగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగ నిబంధన అని ఆర్మీ పేర్కొంటున్నది.
ఇందుకు షేక్ హసీనా, ఖలీదా జియా పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి అవి ఎన్నికల్లో పోటీ చేసేలా ఆర్మీ చీఫ్ జమాన్ ప్రయత్నాలు చేయవచ్చు. అది సాధ్యం కాకపోతే దేశంలో ఎమర్జెన్సీని విధించి యూనుస్ తాత్కాలిక ప్రభుత్వానికి అస్తిత్వం లేకుండా చేయాలనేది ఆర్మీ చీఫ్ భావన. నిజానికి తొమ్మిది నెలల క్రితం దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది.
హసీనా భారత్కు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. బంగ్లాదేశ్లో అప్పటి ఆందోళనలో పాల్గొన్న విద్యార్థి సంఘాలు కొత్తగా జాతీయ పౌర పార్టీ (ఎన్సీపీ)ని ఏర్పాటు చేసి యూనుస్కు గట్టి మద్దతుగా నిలిచాయి. భారత్, పాకిస్థాన్ రాజకీయ విధానాలకు దూరంగా, దేశంలో ‘ప్రత్యామ్నాయం’గా రాజకీయ విధానం ఉండాలని ఎన్సీపీ ప్రచారం చేసుకొంది. గత శని, ఆదివారాల్లో, దేశంలో ఎన్నికలు ఎప్పుడు జరిపించాలన్న విషయంలో ఆర్మీ చేస్తున్న హెచ్చరికలపై దేశవ్యాప్తంగా యూనుస్కు మద్దతుగా ఎన్సీపీ ఆందోళనకు దిగుతుందని భావించారు.
కాని యూనుస్ దాదాపు 20 రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం ప్రధానం కాదని వాటిని ఒప్పించగలిగారు. దేశంలో సంస్కరణలు కాదు, దేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెడుతున్నదని షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోబెల్ బహుమతి గ్రహీతగా తన ప్రభుత్వ హయంలోనే ప్రపంచ ఖ్యాతి గడించిన యూనుస్ ఇప్పుడు ఉగ్రవాద గ్రూపుల చేతిలో, ఒక ఉగ్రవాద నాయకునిగా మారారని హసీనా నిందిస్తున్నారు. రోహింగ్యాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న యూనుస్ ప్రభుత్వ ప్రయత్నాలను ఇటు భారత్కూడా గమనిస్తున్నది.