13-09-2025 07:29:13 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ఈ లోక్ అదాలత్కు కక్షిదారుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 11 బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి జాతీయ లోక్ అదాలత్కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. రాజీమార్గంలో కేసుల పరిష్కారంకోసం కక్షిదారులు పెద్దఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు.
వైవాహిక వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకొని ఒక్కటైన దంపతులకు అవార్డు అందజేసి అభినందించారు. రాజీమార్గమే రాజమార్గమని, చిన్న తగాదాలను లోక్ అదాలత్లో పరిష్కరించుకుని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూచించారు. కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు. కక్షిదారులకు పులిహోర, మంచినీటి సదుపాయాన్ని ఎస్బిఐ వారి సౌజన్యంతో కల్పించారు.