04-10-2025 07:31:46 PM
- 42 శాతం రిజర్వేషన్ జాగృతితోనే సాధ్యపడింది
- రాష్ట్రంలో... బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత అవసరం
- జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్
గజ్వేల్ (విజయక్రాంతి): రాబోవు కాలమంతా బడుగు, బహుజనులదే రాజ్యమని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముదిరాజ్ అన్నారు. జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియామకం పొందిన అనంతరం కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)ను కలిసి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత ఎంతో అవసరమన్నారు. 60 శాతం ఉన్న బీసీల్లో ఐక్యత లోపించిన కారణంగానే రాజ్యాధికారానికి దూరం అవుతున్నామన్నారు. అందుకే వారిని చైతన్యం చేస్తూ సంఘటిత పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సత్తా చాటాలని, ఇందుకు జాగృతి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతo రిజర్వేషన్ ను కొన్ని పార్టీలు జీర్ణించుకోవడం లేదని, అన్ని పార్టీల్లోని బడుగు బలహీన వర్గాలు అధిష్టానాలను ఒప్పించేందుకు కృషి చేయాలని కోరారు.
కామారెడ్డి డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, కోర్టులో అడ్డుకోవాలని చూస్తున్న వారికి తగిన రీతిలో జవాబు చెప్పాలన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తూ తమ అనుచరులను కోర్టులో కేసులు వేయించినట్లు గుర్తు చేశారు. కాగా తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతిని పటిష్టం చేసి సత్తా చాటుతామన్నారు. పేద బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేస్తున్న కవితకు అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్దతు వస్తుందని, రాష్ట్రంలో జాగృతి, కాంగ్రెస్, బిజెపి మినహా ఇతర పార్టీలు అంతర్ధానం అవుతాయన్నారు.