అకాల వర్షం.. ఈదురుగాలులు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
రాలిన మామిడి
కరీంనగర్/కోరుట్ల, మార్చి31(విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందారు.. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్థరాత్రి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. ఈదురు గాలులు భారీగా వీచాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ రాబోయే రెండు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గంగాధర, చొప్పదండి, రాముడు, కరీంనగర్ రూరక్, కొత్తపల్లి మండలలలోని పలు గ్రామాల్లో రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలోనే ఈదురు గాలులు ప్రారంభమై, వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి వర్షం కురవడంతో గ్రామాలన్నీ చల్లని వాతావరణంతో కప్పబడ్డాయి.ఈ అకాల వర్షంతో ఒకవైపు ఎండ తాపం తగ్గి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా పంట కోత సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వర్షం పడటం వల్ల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలు ఈదురు గాలుల దాటికి వరి మొక్కజొన్న మామిడి పంటలు మొత్తం నేలకొరిగాయి. అసలే ఈ సీజన్లో మామిడి పంట అంతంత మాత్రమే ఉండడంతో ఇంతలో రాత్రి కురిచిన గాలి వాన కారణంగా మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వ్యవసాయ మార్కెట్లో సుమారు 400 క్వింటాళ్ల మొక్కజొన్న తడిసి ముద్దయ్యింది అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.




