28 April, 2026 | 3:01 AM

పెట్రోల్ డీజిల్ కోసం లొల్లి..

28-04-2026 01:10 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో సోమవారం పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా అనేక మండలాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పెట్రోల్, డీజిల్ పంపుల్లో డీజిల్ పెట్రోల్ కొరత తలెత్తింది. జిల్లాలోని నర్సింహులపేట, కేసముద్రం, ఇనుగుర్తి తదితర ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి పడిగాపులు పడ్డారు.

డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేదని పెట్రోల్, డీజిల్  కోరినంతగా పోయడం లేదని వినియోగదారులు పలు చోట్ల ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వాహనదారులను క్రమ పద్ధతిలో నియంత్రించి పెట్రోల్ డీజిల్ పంపిణీ చేయించారు. వచ్చింది వచ్చినట్టే కొద్ది క్షణాల్లో పెట్రోల్, డీజిల్ అయిపోతుండడంతో మళ్లీ మరుసటి రోజు స్టాక్ వచ్చేంత వరకు పెట్రోల్, డీజిల్ పంపులు మూతపడుతున్నాయి.  అధికారులు స్పందించి పెట్రోల్, డీజిల్ కొరత తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.