18-08-2025 07:59:32 PM
యూరియా కొరతను తక్షణమే తీర్చాలి
ఎస్కే మదార్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు
బయ్యారం,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా కొరతను తక్షణమే తీర్చి,రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకులు ఎస్.కె మదార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను తక్షణమే తీర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం బయ్యారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ కు అందజేశారు.
ఈ సందర్భంగా మదార్ మాట్లాడుతూ... మారుమూల ఏజెన్సీ పల్లె ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి యూరియా బస్తా కోసం వస్తున్న రైతులకు యూరియా కొరత నిరాశను మిగులుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యూరియా కొరతను తీర్చి, రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.భారీ వర్షంలో సైతం పంపిణీ కేంద్రాల ఎదుట యూరియా కొరకు రైతులు బారులు తీరుతున్న తీరు ప్రభుత్వాలకు,ప్రభుత్వ అధికారులకు కానరావడం లేదా అని ఆయన ప్రశ్నించారు.తక్షణమే యూరియా కొరతను తీర్చక పోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు.