18-08-2025 08:29:36 PM
గద్వాల,(విజయక్రాంతి): జిల్లాలో యూరియాకు గాని ఇతర ఎరువులకు గాని ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుతో కలిసి ఆయా జిల్లాల్లో పంటల సాగు, యూరియా లభ్యతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈసారి ముందస్తు వర్షాలు పడటం ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు అన్ని రకాల పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం కలిగిందన్నారు.
రైతులకు అవసరమైన యూరియా ఇతర ఎరువులు అందుబాటులో ఉండే విధంగా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యూరియా విషయానికొస్తే భారతదేశానికి ఇతర దేశాల నుంచి రావాల్సిన యూరియా సకాలంలో రావడంలేదని అయినప్పటికిని తెలంగాణ రాష్ట్రంలో నిలువ ఉన్నటువంటి యూరియాను ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు లేకుండా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, ఎ.డి.ఎ. సంగీతలక్ష్మి, మార్కెటి శాఖ అధికారి పుష్పమ్మ, కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.