పాత బకాయిలపై 90% వడ్డీ మాఫీ
పన్ను చెల్లింపులో జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్
పన్నుతో పాటు 10 శాతం వడ్డీ చెల్లిస్తే సరి
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): నగర ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిల భారాన్ని దించుకునేందుకు అద్భుత మైన అవకాశాన్ని కల్పించింది. పాత బకాయిలపై ఏకంగా 90 శాతం వడ్డీని మాఫీ చేస్తూ ‘వన్ టైమ్ సెటిల్మెంట్ 2025 పథకాన్ని కొనసాగిస్తున్నట్లు గురువారం అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఓటీఎస్ పథకం కింద పన్ను చెల్లింపుదారులు తమకు ఉన్న మొత్తం ఆస్తి పన్ను బకాయితో పాటు, దానిపై ఇప్పటివరకు లెక్కించిన వడ్డీలో కేవలం 10 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
ఇలా ఒక్కసారిగా చెల్లింపు జరిపిన వారికి, మిగిలిన 90 శాతం వడ్డీ పూర్తిగా మాఫీ చేయబడుతుంది. పౌరులు ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు జీహెచ్ఎంసీ సాంకేతిక మార్గాలను విస్తృ తం చేసింది. ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా సులభంగా పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించింది. మై జీహెచ్ఎంసీ మొబైల్ యాప్, జీహెచ్ఎంసీ వ్బుసైట్ ద్వారా చెల్లించవచ్చు. నగరవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్లు ద్వారా కూడా బకాయిలు జమ చేయవచ్చు.




