మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి వరంగల్ ఎంపీ జన్మదిన వేడుకలు
హనుమకొండ (మహబూబాబాద్), ఏప్రిల్ 10 (విజయక్రాంతి): వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తన జన్మదిన వేడుకలను హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి చెందిన మానసిక దివ్యాంగ చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వారి ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన ఎంపీ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులు, చదువులు, వారి ఆసక్తులు గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం చిన్నారులకు స్వయంగా స్వీట్లు తినిపించి ఆప్యాయత పంచుకున్నారు. చిన్నారులు తయారు చేసిన కళాకృతులను ఎంపీకి బహుమతిగా అందజేయగా, వాటిని స్వీకరించిన ఎంపీ వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లా డుతూ, మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి పిల్లలకు ప్రేమ, ఆదరణ, ప్రోత్సాహం అందించాలని ఎంపీ పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మల్లికాంబ మనోవికాస కేంద్రం నిర్వాహకులు పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




