calender_icon.png 18 December, 2025 | 7:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిడ్డంగులు ఏర్పాటు చేయాలి..

13-12-2025 12:00:00 AM

దేశంలో రైతు పండించిన ధాన్యం, ఇతర ఉత్పత్తులు మార్కెట్ లోకి వెళ్లే వరకు సంశయంగా ఉంటున్నది. అకాల వర్షాలు మన దేశ రైతుకు ఒక శాపంగా మారుతున్నది. పండించిన ధాన్యాన్ని సురక్షితంగా భద్రంగా నిలువ చేసేందుకు సరైన గిడ్డంగులు ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా రైతు బ్రతుకు గాలిలో దీపంగా మారుతున్నది. లక్షలు పెట్టి పండించిన పంటల ఫలితం అందక పోవడం వల్ల రైతు బతుకు చిద్రంగా మారుతున్నది.

దేశానికి అన్నం పెడుతున్న రైతుకు సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు రైతుల గురించి ఎన్నెన్నో కట్టుకథలు చెబుతుంటారు. కానీ ఆచర ణలో శూన్యం. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వవలసిందే.. అత్యంత ఆధునిక స్టేడియాలు ఇతరత్రా వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ప్రస్తుత సమయంలో తక్షణం అవసరంలేని రంగాలకు విస్తృత స్థాయిలో ఆధునిక సాంకే తిక ఆర్భాటాల హంగులతో అత్యున్నతమైన సేవలు కల్పిస్తున్నారు.

కానీ విచిత్రంగా ఆహార ధాన్యాలు నిల్వ చేయుటకు గిడ్డంగులను నిర్మించే విషయం మాత్రం అధికారులు గాలికొదిలేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి నిల్వలకు సరైన ప్రణాళికలు చేపట్టకపోవడం వల్ల వ్యవసాయం అంటేనే రైతులు ఆందోళన పడే పరిస్థితి నెలకొన్నది. దేశం సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే ప్రాథమికంగా రైతుకు అత్యాధునిక పద్ధతిలో సకల సౌకర్యాలు విస్తృత స్థాయిలో ఉచితంగా ఏర్పాటు చేయాలి.

అప్పుడే దేశంలో రామరాజ్యం ఏర్పడుతుంది. ఇతర రంగాలకు ఏ విధంగానైతే ప్రాముఖ్యత ఇస్తూ అత్యాధునిక వసతులతో సౌకర్యాలు కల్పిస్తున్నారో, అంతకంటే అధిక ప్రాముఖ్యంతో రైతులకు ప్రతి విషయంలో కూడా తగిన వసతులు ఏర్పాటు చేయాలి. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అన్ని రంగాల్లో  ప్రగతి బాటలో పయనిస్తుంది.

 రాంచందర్ రావు, మిర్యాలగూడ