వినూత్న డిపాజిట్ సాధనాల్ని తెస్తాం
ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: డిపాజిటర్లను ఆకర్షించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికరింగ్ డిపాజిట్, సిప్ కాంబినేషన్తో పాటు పలు వినూత్న డిపాజిట్ పత్రాల్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నదని ఆ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. ఖాతాదారుల్లో ఆర్థిక వ్యవహారాల పట్ల అవగాహన పెరిగిందని, డిమాండింగ్గా ఉన్నా రని ఆయన చెపుతూ కొత్త రకాల పెట్టుబడి సాధనాల్ని ప్రారంభించాలని చూస్తున్నామన్నారు.
ఆర్థిక అక్షరాస్యత మెరుగు పడినం దున ఖాతాదారులు వారి పెట్టుబడికి తగిన విలువను కోరుకుంటున్నారని, పెట్టుబడుల్ని వివిధ సాధనాల్లో పెట్టాలని భావిస్తున్నారని శెట్టి తెలిపారు. ‘ఎవరూ తమ పెట్టుబడినంతటినీ పూర్తిగా రిస్కీ లేదా స్పెక్యులేటివ్ ఆస్తుల్లో పెట్టాలనుకోరు. వారి మదుపు బాస్కెట్లో బ్యాంకింగ్ సాధనాలు ఎప్పటికీ ఉంటాయి. అందుచేత మేము వారికి ఆకర్షణీయమైన మదుపు సాధనాల్ని తేవాలని ప్రయతిస్తున్నాం’ అని ఎస్బీఐ చైర్మన్ వివరించారు.
రికరింగ్ డిపాజిట్ వంటి సాంప్ర దాయక డిపాజిట్ /ఫిక్స్డ్ డిపాజిట్ సాధనాన్ని, సాంప్రదాయక సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (సిప్)ను కలిపి కాంబినేషన్లో వినూత్న డిజిటల్ ప్రాడక్ట్ను డిజిటల్గా కూడా ఆకర్షణీయంగా ఉండేలా ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నామని శెట్టి వివరించారు. జనరేషన్ జడ్లో ప్రాచుర్యం సంపాదించే డిపాజిట్ సాధానాలను పరిచయం చేయాలని బ్యాంక్ భావిస్తున్నదన్నారు.
రోజుకు 60 వేల ఖాతాలు ప్రారంభం
ఎస్బీఐలో రోజుకు 50,000 నుంచి 60,000 కొత్త బ్యాంక్ ఖాతాలు ప్రారంభమవుతున్నాయని, కొత్త ఖాతాల్ని ఆకర్షించడంపై బ్యాంక్ దృష్టిపెట్టిదని చైర్మన్ పేర్కొన్నారు. తమ ఫిక్స్డ్ డిపాజిట్లలో 50 శాతం డిజిటల్ చానళ్ల ద్వారానే వస్తున్నాయని, పలు ఖాతాలు డిజిటల్గానే ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
రూ.లక్ష కోట్ల నికరలాభాన్ని ఆర్జిస్తాం
వచ్చే 3 నుంచి 5 ఏండ్లలో రూ.1 లక్ష కోట్ల నికరలాభాన్ని ఆర్జించిన తొలి భారతీయ బ్యాంక్గా ఆవిర్భవించాలన్నది ఎస్బీఐ లక్ష్యమని శ్రీనివాసులు శెట్టి చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రూ. 61,077 కోట్ల స్టాండెలోన్ నికరలాభాన్ని సాధించింది. లాభాలు, మార్కెట్ విలువ తదితరాలు తమ సంస్థకు చాలా ముఖ్యమైనవన్నారు.






