జీవచ్ఛవాన్ని మనిషిగా మార్చారు!
- వినోద్కు అండగా అన్నం ఫౌండేషన్..
- సపర్యలు చేసి.. కొత్త బట్టలు తొడిగించి..
- ఖమ్మంకు తరలింపు
కేసముద్రం, జూలై 2 (విజయక్రాంతి): 30 ఏళ్ల వయసు గల వినోద్ అనే యువకుడికి..నా అనే వారు లేరు.. పక్షవాతంతో అనాథగా మారి నిస్సహాయంగా జీవచ్ఛవంగా మారి జీవనం సాగిస్తున్న వినోద్కు అన్నం ఫౌండేషన్ మానవత్వంతో చేయూతనిచ్చి మనిషిగా మార్చింది. పక్షవాతం కారణంగా కాళ్లు, చేతులు, నోరు పనిచేయని స్థితికి చేరుకున్న వినోద్ సమాజానికి దూరమై, జీవన్మరణ పోరాటం చేస్తూ కేసముద్రం మున్సిపాలిటీ లోని బడి తండాలో అత్యంత దయనీయ పరిస్థితుల్లో కనిపించాడు. వినోద్ పరిస్థితి గురించి తెలుసుకున్న అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాస్ వెంటనే అక్కడికి చేరుకుని, నీవు ఒంటరివి కాదు... మేమున్నాం అనే భరోసా కల్పించారు.
అపరిశుభ్రంగా, అనారోగ్యంతో, చెత్త కుప్పల మధ్య, చెట్టు కింద ఉన్న ఆయనకు ప్రేమగా సపర్యలు చేసి, స్నానం చేయించి, కొత్త బట్టలు తొడిగించారు. అనంతరం ఆహారం అందించి, మెరుగైన వైద్య చికిత్స, సంరక్షణ కోసం ఖమ్మంకు తరలించారు. ఒక నిరాధారుడి కళ్లలో మళ్లీ ఆశ వెలిగించిన అన్నం ఫౌండేషన్ సేవలు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. రక్తసంబంధాలు దూరమైన చోట మానవత్వమే బంధువుగా మారి, ప్రేమతో చేయూతనిస్తే ఒక జీవితాన్ని నిలబెట్టవచ్చని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. నిరాధారులు, అనాథలు, ఆపన్నులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని పరిమళింపజేస్తున్న అన్నం ఫౌండేషన్ సేవలను స్థానికులు హృదయపూర్వకంగా అభినందించారు.






