calender_icon.png 6 June, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశు మరణాలను తగ్గించడాన్ని సమిష్టిగా కృషి చేయాలి

04-06-2025 10:33:51 PM

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): శిశు మరణాలు తగ్గించడాన్ని వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, అనుబంధ శాఖలు సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) కోరారు. బుధవారం నల్గొండలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నల్గొండ, మిర్యాలగూడ డివిజన్లకు సంబంధించిన శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శిశు మరణాల విషయంలో అన్ని శాఖలు, వారి ప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. శిశు మరణాలను తగ్గించేందుకు ఆస్కారమున్న ప్రతి కేసు విషయంలో మొదటి నుండి కృషి చేయాలని, ఒక శిశువుని కాపాడడం వల్ల ఒకరి జీవితాన్ని రక్షించిన వారమవుతామన్నారు.

ఈ బాధ్యతను ఒక ఉద్యోగిగా కాకుండా, ఒక మనిషిగా ఇతరుల ప్రాణాలు రక్షించే అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావించి పని చేయాలని పిలుపునిచ్చారు.శిశు మరణాలను తగ్గించేందుకు మహిళ గర్భం దాల్చినప్పటి నుండి శిశువు పుట్టిన తర్వాత ఒక సంవత్సరం వరకు నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తూ తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నారు. మొదటి కానుపుకే కాకుండా  రెండు, మూడు ఎన్ని కాన్పులైనా సరే  తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .జిల్లాలో శిశు మరణాలు సంభవించకుండా ఉండేందుకుగాను జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని, ప్రత్యేకించి శిశు మరణాలు తగ్గించడంలో వైద్యాధికారులు, ఆశ అంగన్వాడీల బాధ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పారు.

భవిత కేంద్రాల ద్వారా మానసిక వైకల్యం కలిగిన, విభిన్న సామర్ధ్యాలు కలిగిన వారు జిల్లాలో 700 మంది పిల్లలు మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని తెలిపారు. జన్యుపరమైన లోపాల వల్ల కొంతమంది మానసిక వికలాంగులుగా జన్మిస్తే, మరికొందరు పుట్టిన తర్వాత వైకల్యం, మానసిక వైకల్యం, ఇతర వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. గర్భధారణ సమయంలోనే కొన్ని లోపాలు ఉంటున్నాయని, మానసిక వైకల్యంతో పుట్టిన వారి మానసిక వికాసానికి చికిత్స చేయడం ఒక ఎత్తయితే, అసలు వారు ఇలాంటి మానసిక వైకల్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత వైద్య ,శిశు సంక్షేమ శాఖలపై ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఏరియా ఆస్పత్రిల కో-ఆర్డినేటర్ డాక్టర్ మాత్రు నాయక్, డీఈఓ, డిప్యూటీ డిఎం హెచ్ వో లు, తదితరులు పాల్గొన్నారు.