04-06-2025 10:21:58 PM
మందమర్రి (విజయకాంతి): పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ(MP Vamsi Krishna Gaddam) మొదటి వార్షికోత్సవ పాలన విజయోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బి-1 క్వార్టర్ నందు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ, యువజన, సేవాదళ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి, వేడుకలు నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు మంద తిరుమల్ రెడ్డి, పైడిమల్ల నర్సింగ్ లు మాట్లాడుతూ... దివంగత మహానేత కాకా వెంకటస్వామి మనవడు, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ గా సంవత్సర కాలం పాలన గడిచిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
ఎంపీగా గెలిచిన అనంతరం పార్లమెంట్ నియోజకవర్గానికి పెద్దకొడుకు లాగా ఉంటానని ఇచ్చిన హామీ మేరకు హామీని నిలబెట్టుకున్నాడని తెలిపారు. ఎన్నికల్లో ఒక లక్ష 35 వేల భారీ మెజార్టీతో అతి చిన్న వయస్సులోనే వంశీకృష్ణ విజయం సాధించారన్నారు. వంశీకృష్ణ ఎంపీగా విజయం సాధించిన అనంతరం సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పదివేల పెన్షన్ ఇవ్వాలని పోరాడి, పెన్షన్ ఫండ్ కు 144 కోట్లు అందేలా కృషి చేశారని తెలిపారు.
అదేవిధంగా సింగరేణిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ఎల్లంపల్లి ముంపు గ్రామాల బాధితులకు పరిహారం, కోల్ బెల్ట్ ఏరియాలో కరోనా కాలంలో నిలిపివేసిన అజ్నీ ఎక్స్ ప్రెస్ రైల్ పునః ప్రారంభం, పెద్దపల్లి రైల్వే స్టేషన్లో తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్ హాల్టింగ్, రామగుండంలో ఏర్ పోర్ట్ ఏర్పాటుకు కృషి, పెద్దపల్లి నియోజకవర్గంలో నవోదయ విద్యాలయం ఏర్పాటు, ఎన్టిపిసి పవర్ ప్లాంట్ విస్తరణకు కృషి, బడుగు బలహీన వర్గాలకు త్రాగునీరు అందించేలా బోర్వెల్ లాంటి అనేక అభివృద్ధి పనులు విజయవంతంగా చేపట్టి, పూర్తి చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నామని ముత్తయ్య, వనం నర్సన్న, ఎర్ర రాజు, ఇషాక్, బండి శంకర్, లక్ష్మణ్, వెంకన్న, రాచర్ల గణేష్, సట్ల సంతోష్, విజయ్, సతీష్, వేణు, శ్రీనివాస్, అంజయ్య, రామకృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, ఎండి జావిద్ ఖాన్, మూడారపు శేఖర్, సేవాదళ్ నాయకుడు సురేందర్, యువజన నాయకులు చోటు, మహేష్, సూరజ్, రాజు అజయ్, బాచి లు పాల్గొన్నారు.