యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం
మథుర: పొగమంచు కారణంగా తక్కువ దృశ్యమానత వల్ల మథురలోని యమునా ఎక్స్ప్రెస్వే(Yamuna Expressway) మైలురాయి 127 వద్ద కనీసం ఏడు బస్సులు, మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మంటలు చెలరేగాయి. మరో 25 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ఎవరి పరిస్థితి కూడా విషమంగా లేదని మధుర ఎస్ఎస్పి శ్లోక్ కుమార్ తెలిపారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు మథురలోని బలదేవ్ ప్రాంతంలో జరిగింది. మరణించిన నలుగురిలో ముగ్గురు బస్సులలో ఉండగా, ఒకరు కారులో ఉన్నారు.
మధుర ఎస్పీ సురేష్ చంద్ర రావత్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో బస్సుల్లో ఒకటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినదని, మిగిలిన ఆరు ప్రైవేట్ స్లీపర్ బస్సులని తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. పెద్దఎత్తున మంటలు చెలరేగి బస్సులు, కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశాయి. ప్రమాదం నుంచి పలువురు ప్రయాణికులు బయటపడ్డారు. ఘటనాస్థలిలో పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం(UP Government) రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించింది.




