దుర్మార్గుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి సీతక్క
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాలికి పరామర్శ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కొల్లా పూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడి చేసిన నిందితులను వదిలిపెట్టేది లేదని, దుర్మార్గుల పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం ఆమె హైదారబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతున్న ఈశ్వర మ్మను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. నాగర్కర్నూల్ ఎస్పీ వైభవ్తో ఫోన్లో మాట్లాడి మహిళపై దాడి కేసు పురోగతి తెలుసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు.
బాధితురాలి మామయ్య నాగయ్య మృతి పట్ల కూడా కుటుంబ సభ్యులకు అనుమానాలున్నాయన్నారు. ఆ కేసును వేగిరం చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. ఈశ్వరమ్మపై దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదన్నారు. మధ్యయుగాల నాటి మనస్తత్వంతో కొందరు దాడులకు తెగబడుతున్నారన్నారు. మహిళపై దాడి కేవలం భూమి కోసమే జరిగిందన్నారు. భూముల ధరలు పెరిగినందున కొం దరు చెంచుల పేదరికం, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్నారన్నారు. వారి భూములను లాక్కునేందుకు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈశ్వరమ్మపై దాడి చేసిన నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయించామన్నారు. బాధితురాలికి ఇప్పటికే రూ.4 లక్షల సాయం అందించామన్నారు. మంత్రి వెంట రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, నాగర్ కర్నూల్ ఐటీడీవో రోహిత్ తదితరులున్నారు.






