31-10-2025 12:00:00 AM
నవంబర్ 10న కామారెడ్డిలో బహిరంగ సభ
బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ చిరంజీవులు, విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : బీసీ కోటా సాధించే వరకు బీసీ రిజర్వేషన్ల సాధన సమితి విశ్రమించదని బీసీ మేధావుల ఫోరం చైర్మన్ టీ.చిరంజీవులు, విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వర య్య స్పష్టం చేశారు. నవంబర్ 10వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పోరాట ప్రణా ళికను ప్రకటిస్తామని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో బాలగౌని బాల్ రాజ్ గౌడ్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా హాజరైన నాయకులు మాట్లాడుతూ... 24న జరిగిన బీసీల మహాధర్నాలు పెద్ద ఎత్తున బీసీలు పాల్గొని జయప్రదం చేశారని, 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు పోరాడుతాయని తెలిపారు. 9వ షెడ్యూల్లో చేర్చడమే 42 శాతం రిజర్వేషన్లకు శ్రీరామరక్ష అని, అప్పుడే రాజ్యాంగ రక్షణ ఉంటుందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామ కాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాటం చేశాయని, కానీ రెండున్నర కోట్ల మంది బీసీలు 42 శాతం కోసం ఉద్యమిస్తుంటే రాజకీయ పార్టీలు చలించడం లేదని విమర్శించారు.
అన్ని పార్టీలను ప్రజాక్షేత్రంలో ముద్దాయిలను చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. రాజ్యాధికార దిశగా పయనిస్తామని బీసీలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలు బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయని స్పష్టం చేశారు. నవంబర్ 3న అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వోలకు వినతి పత్రాలు ఇస్తామని, 4న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తామని, 6న సీఎస్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. 7న రాష్ర్ట స్థాయి విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని వివరించారు.