8 లక్షల కోట్ల సంపద ఆవిరి
- జోరుగా షేర్ల విక్రయాలు.. స్టాక్ మార్కెట్ డమాల్
- బీఎస్ఈ మార్కెట్ విలువ రూ.౪౮౦ లక్షల కోట్లు
- ఒక్కరోజులోనే రూ.౪౭౨ లక్షల కోట్లకు డౌన్
- అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల ప్రభావం
ముంబై, జూలై ౮: దేశీయ స్టాక్ మార్కెట్ (బీఎస్ఈ) బుధవారం భారీ నష్టాలను చవిచూసింది. దలాల్ స్ట్రీట్లో షేర్ల అమ్మకాల తాకిడికి మదుపర్ల సంపద ఒక్కరోజే రూ.౮ లక్షల కోట్ల ఆవిరైంది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు భారత మార్కెట్లను కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో బుధవారం ఉదయం నుంచే అమ్మకాలు ఊపందుకోవడంతో సూచీలు క్రమంగా పతనం వైపు సాగాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి బెంచ్మార్క్ సూచీలు ౨ శాతానికి పైగా కుప్పకూలాయి. బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.480 లక్షల కోట్లు కాగా, బుధవారం ఆ మొత్తం 472 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్ 77,816 పాయింట్ల వద్ద బలహీనంగా మొదలై, ఒక దశలో 76,259 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. ముగింపు సమయానికి 1658 పాయింట్లు కోల్పోయి, 76,522 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సూచీ ఉదయం 24,259 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
రోజంతా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ చివరకు 500 పాయింట్లు నష్టపోయి 23,897 పాయింట్ల వద్ద ముగిసింది. సంపద ఆవిరి కావడానికి అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం కూడా కారణమి వెల్లడిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ సైతం కుదేలు
ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామని, సీజ్ఫైర్ ముగిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా డౌన్ అయ్యాయి. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదుపర్లను ఆందోళనలోకి నెట్టాయి. ఫలితంగా వారు ఉన్నఫళంగా తమ షేర్ల విక్రయం ప్రారంభించారు. దీంతో అమెరికాలోని ప్రధాన మార్కెట్ సూచీ ‘నాస్డాక్’ ఒక్కసారిగా 1.16 శాతం నష్టాల్లోకి కూరుకుపోయింది.
ఎస్అండ్పీ 500 సూచీ 0.45 శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.25 శాతం నష్టాన్ని చవిచూసింది. ముఖ్యంగా సాంకేతిక రంగ షేర్లు, సెమీకండక్టర్ కంపెనీల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మైక్రాన్ టెక్నాలజీస్ వంటి చిప్మేకర్ల షేర్లు సైతం కుప్పకూలాయి.ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, తైవాన్ దేశాల కీలక సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి.






