సంచార జాతలకు సంక్షేమ ఫలాలు
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో సంచార జాతుల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు సద్వినియం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ మందిరంలో సంచార జాతుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వెనుకబడిన సంచార, విముక్త తెగల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
సంచార జాతుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించడంతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వాలు అందించే పథకాలను వినియోగించుకోవాలని తెలిపారు. సంచార జాతుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాథోడ్ రమేష్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






