28-01-2026 09:34:28 PM
* సంగారెడ్డి జిల్లాలో పడి పాపన్నపేట మండలంలో శవమై తేలాడు..
* 15 రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం
పాపన్నపేట: మంజీరాలో కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునికి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఎనికేపల్లి గ్రామ శివారు మంజీరా నదిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన అన్నాసాగర్ లక్ష్మయ్య(85) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈనెల 13న ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. గ్రామ శివారులో మంజీరా నది వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయాడు.
రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబీకులు చుట్టూ పక్కల వెతికారు. ఆచూకీ లభించక పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం మండల పరిధిలోని ఎనికేపల్లి గ్రామ శివారులో మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించగా పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఆనవాళ్లను బట్టి మృతి చెందింది లక్ష్మయ్యగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించి మృతుడి కొడుకు బేతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.