calender_icon.png 12 June, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువవికాసం ఎప్పుడు?

11-06-2025 12:46:20 AM

  1. పథకం అమలుకు కొలిక్కిరాని ఎంపిక ప్రక్రియ
  2. దరఖాస్తుదారుల్లో అయోమయం 

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో యువతకు, నిరుద్యో గులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం తలపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో అస్పష్టత కొనసాగుతోంది. జూన్ రెండవ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రుణ మంజూరు పత్రాలు ఇవ్వా ల్సి ఉన్నా దరఖాస్తుల్లో అనర్హులున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

పథకాన్ని ప్రతిష్ఠా త్మకంగా తీసుకొస్తున్నందున పూర్తిస్థాయిలో లబ్ధిదారుల ఎంపికను క్షుణ్ణంగా, మరింత లోతుగా జరగాలని ముఖ్యమంత్రి సూచించడంతో ఈ పథకం అమలు వాయిదా పడింది. కొత్తగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మళ్లీ ఏ విధంగా చేస్తారో అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. దాదాపు 6వేల కోట్లతో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది.

ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఈ పథకంలో రుణాలు మంజూరు చేస్తారు. గత మార్చినెల 15 ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రి య ఏప్రిల్ 14న చివరి తేదీగా ముగిసింది. దాదాపు 16,23,764 మంది దర ఖాస్తులు చేసుకున్నారు. ఈ పథకంలో 50వేల లోపు  రుణాలకు 100శాతం సబ్సిడీ, లక్షలోపు రుణాలకు 90శాతం సబ్సిడీ, రెండు లక్షల లోపు రుణాలకు 80శాతం సబ్సిడీ, నాలుగు లక్షలకు 70శాతం సబ్సిడీ లబ్ధిదారులకు లభించనున్నది.

మొదట విడత ఈ ఏడాది జులై లోపు లక్ష మందికి 850 కోట్లు, ఆగస్టులో లక్షమందికి 1250 కోట్లు, సెప్టెంబ ర్‌లో లక్ష మందికి 1500 కోట్లు, అక్టోబర్‌లో లక్షమందికి 1600 కోట్లు నిదులు కేటాయించి లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. యాబైవేల రూపాయల రుణాలకు వంద శాతం సబ్సిడీ ఉన్నా కూడా దరఖాస్తులు 39,401 దర ఖాస్తులు వచ్చాయి.

లక్షలోపు రుణాలకు 90 శాతం సబ్సిడీ ఉన్నా కూడా 93,233 దరఖాస్తు లు వచ్చాయి. ఇక రెండు లక్షలలోపు రుణాల కోసం 2,49,434 మంది, నాలుగు లక్షల లోపు రుణాలకు.. ఏకంగా 12,41,696 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 16,23,764 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రెండు లక్షలకు, నాలుగు లక్షలకు సబ్సిడీ కాస్త తక్కువగా ఉన్నా పెద్దమొత్తంలో లోన్లు వస్తాయని ఆశతో దరఖాస్తుదారులు ఈ రెండు కేటగిరీలకే దాదాపుగా 14,91,130 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

రెండో విడత రుణాల మంజూరు ఆలస్యం అయినా సరే సబ్సిడీ కూడా పెద్ద శాతమే ఉండటంతో లబ్ధిదారులు రెండు నుంచి నాలుగు లక్షల లోపు రుణాలకు చాలా పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం తొలి విడతలో యాభైవేలలోపు, లక్షలోపు రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు చేయాలని భావించింది.

కానీ, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంఖ్య కంటే తక్కువగా దరఖాస్తులు అందడంతో ఏం చేయాలన్న మీమాంసంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో పథకం అమలుపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దీనితో పాటు స్థానిక నేతలు, పార్టీ వర్గాలు కూడా ఈ పథకంలో తమ అనుచరులను పెద్దసంఖ్యలో చేర్చడానికి దరఖాస్తులు తీసుకున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం.

ఈ అంశాన్ని ప్రభుత్వవర్గాలు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఒక్క అనర్హుడికి కూడా ఈ పథకంలో చోటు ఉండకూడదన్న సీఎం ఆదేశంతో మరింత లోతుగా దరఖాస్తుల వడపోతను చేపట్టే పనిలో అధికారులున్నారు. అనర్హుల ఏరివేత ఎప్పుడు చేస్తారు.. ఏ విధంగా చేస్తారో అన్న అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

దీనికి తోడు యూనిట్లను మార్చుకునే అవకాశం కూడా ఉండటంతో ఈ మార్పులు, చేర్పులు ఏ రకంగా చేస్తారో కూడా మరింత క్లారిటీ ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పథకం అమలు వాయిదాతో ఇప్పటికే నిరాశలో ఉన్న అర్హులైన లక్షలమంది, ఇప్పుడు ఉత్పన్నమైన కొత్త సమస్యలపై ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో అన్న టెన్షన్‌లో ఉన్నారు.