భర్త హత్య కేసులో భార్య, ప్రియుడికి జీవిత ఖైదు
కుషాయిగూడ, మార్చి 11 (విజయక్రాంతి): భర్తను హత్య చేసిన కేసులో భార్య తో పాటు ఆమె ప్రియుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో నమోదైన 2019 హత్య కేసులో మేడ్చల్మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
ఈ కేసులో నిందితులైన బెరా రేణుక (37), దేవగాడ కిషోర్ (30)లను కోర్టు దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించింది. వీరు కీసర మండలం అహ్మద్గూడలోని ఆర్జీకే కాలనీకి చెందినవారు. పోలీసుల వివరాల ప్రకారం 2019 మార్చి 13 రాత్రి రేణుక తన అక్రమ సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రియుడు కిషోర్ సహాయంతో భర్త బెరా వసంత్ను మద్యం తాగించి చేతులు, కాళ్లు కట్టి చున్నీతో గొంతు బిగించి హత్య చేశారు.
అనంతరం మద్యం సేవించి మృతితి చెందినట్లు చూపిస్తూ కేసు ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కీసర పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించడంతో నిందితులు దోషులుగా తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో పనిచేసిన దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుల్లను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అభినందించారు.




