04-06-2025 01:10:41 AM
ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలని ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం మెట్టుసాయికుమార్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ..
రాష్ట్ర అవతరణ ఉత్సవాలను బీఆర్ఎస్ నాయకులు అవమానించారని మండిపడ్డారు. తెలంగాణ కోసం తలతాకట్టు పెట్టి, చావునోట్లో తలపెట్టిన కేసీఆర్ ఎక్కడున్నాడని, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ ఉత్సవాలకు ఎందుకు రాలేదని మెట్టు సాయి ప్రశ్నించారు. టెక్సాస్లో గింటన్ అనే ప్రాంతాన్ని కేటీఆర్.. గుంటూరు అని ఉచ్చరించారని, కేటీఆర్ నోట్లో నుంచి గుంటూరు పేరు ఎందుకు వస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
టెక్సాస్లో కేటీఆర్ తెలంగాణ పరువును తీశారని మండిపడ్డారు. టెక్సాస్లో తలదాచుకోవడానికి కేటీఆర్ విల్లా కొన్నాడని, తప్పు చేసినట్టు రుజువైతే ఎక్కడ దాచుకున్నా వదిలిపెట్టమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవ హారాన్ని సెటిల్ చేసేందుకే కేటీఆర్ విదేశాలకు వెళ్లాడని మెట్టు ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి లేదని, ఆయన ఆలోచనలు, సలహాలు ఉంటే కేటీఆర్కు, బీఆర్ఎస్ నాయకులకు ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ ఎస్కు ప్రతిపక్ష హోదా రాకుండా ప్రజలు చూసుకుంటారన్నారు.