04-06-2025 01:12:08 AM
- జేఎన్టీయూహెచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
కూకట్పల్లి, జూన్ 3: జాతీయ విద్యా విధానం అమలులో జేఎన్టీయూ అగ్రగామిగా నిలుస్తున్నదని, నూతన కోర్సులు, డిజిటల్ ఆధారిత అభ్యాసకేంద్రిత మోడళ్లను ప్రవేశపెట్టి విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు చేపడుతూ కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు.
జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ 13వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. యూనివర్సిటీ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులు, అధ్యాప కులు, అధికారులు, జేఎన్టీయూహెచ్ సిబ్బందిని అభినందించారు.
2023 2024 విద్యా సంవత్సరానికి మొత్తం 91,840 డిగ్రీలు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.498 కోట్ల పరిశోధన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి పొందినట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాల అనుసరణలో భాగంగా 25 దేశాల నుంచి 237 విదేశీ విద్యార్థులు జేఎన్టీయూహెచ్లో చేరడం విశ్వవిద్యాలయ వైవిధ్యాన్ని, గ్లోబల్ గుర్తింపును చాటుతోందని వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న ఈ యుగంలో, విద్యార్థులు సృజనాత్మకత, నైతికత మానవీయ విలువలతో ముందుకు సాగాలని సూచించారు. స్వావలంబన భారత్ దిశగా యువత ముందుండి నడిపించాలన్నారు. శాస్త్రీయ పరిశోధన, ఆవి ష్కరణలు సమాజసేవలలో విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.