పంద్రాగస్టుకల్లా ఏకరూప దుస్తుల పంపిణీ పూర్తవుతుందా?
అయిజలో ఇంకా అందని నిక్కర్ వస్త్రం... ఆందోళనలో పాఠశాలలు
అయిజ, ఆగస్టు 6 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో పంద్రాగస్టు నాటికి పంపిణీ పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 14 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 1,943 మంది విద్యార్థులు (బాలురు 978, బాలికలు 965) ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
అయితే విద్యార్థుల షర్టుల కుట్టు పనులు కొనసాగుతున్నప్పటికీ, బాలురకు అవసరమైన లాగుల వస్త్రం (నిక్కర్ కోసం క్లాత్) ఇంకా అందలేదని సమాచారం. దీంతో యూనిఫారాల తయారీ ఆలస్యమవుతుందేమోనని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారి వెంకట్రాములు స్పందిస్తూ, కుట్టు మిషన్లు, దర్జీల సంఖ్యను పెంచి పంద్రాగస్టు నాటికి యూనిఫారాల పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.






