05-08-2025 12:00:00 AM
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ఆసిఫాబాద్లో మహా గర్జన సన్నాహక సమావేశం
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి): పెన్షన్ ఇస్తారా, రాజీనామా చేస్తారా అనే నినాదంతో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఈ నెల 13న హైదరాబాద్లో నిర్వహించే మహాగర్జన సభకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ర్ట నాయకుడు ఇస్లాం బిన్ హసన్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు.
పెన్షన్లు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా నిర్వహించే మహా గర్జనకు పెద్ద ఎత్తున పెన్షన్దారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. పెన్షన్దారులకు గత 20 నెలలుగా పెన్షన్ పెంచకపోవడంతో 20 వేల కోట్లు ప్రభుత్వానికి మిగులు జరిగిందని ఈ మొత్తాన్ని రైతు భరోసాకు కేటాయించారని ఆరోపించారు. భూస్వాముల మీద ఉన్న పట్టింపు దివ్యాంగులపై లేదన్నారు.
ఇప్పటికే 20 నెలలు పెన్షన్ దారులు నష్టపోయారని ఉద్యమం చేయకుంటే మరో 20 నెలలు కూడా నష్టపోవాల్సి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి పెద్దపల్లి సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు బన్నమూర్తి, నాయకులు శ్రీనివాస్, అనిల్, పెంటు బాయ్, రాజయ్య, పెంటయ్య, ఖయ్యూం, లక్ష్మి పాల్గొన్నారు.