నా కుమారుడు భరత్‌ను గెలిపించండి

22-04-2024 12:10:00 AM

బీజేపీ గెలుపుతోనే దేశాభివృద్ధి

నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడు తన కుమారుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ను గెలిపించాలని నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పాత బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భరత్ గెలిచిన వెంటనే జిల్లాకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో మూడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేస్తాడన్నారు. ఇప్పుడు యావత్ దేశం బీజేపీ వైపు చూస్తున్నదని, బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఈనెల 25న భరత్ మరో సెట్ నామినేషన్‌ను దాఖలు చేస్తున్నాడని, అతిథిగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ హాజరవుతున్నారన్నారు. కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి మహేంద్రనాథ్ స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన వారసత్వంగా భరత్ రాజకీయాల్లోకి వచ్చాడన్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న భరత్‌ను కొందరు అణగదొక్కాలని చూశారన్నారు. కానీ బీజేపీ మాత్రం తన కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించకయినా తాను ఎంపీగా జిల్లాలో రోడ్లు, వంతెనలకు నిధులు తెచ్చానన్నారు. రైల్వేలైన్ సాధన కోసం కృషి చేశానన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రధినిధి దిలీప్ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి, బూసిరెడ్డి సుధార్‌రెడ్డి పాల్గొన్నారు.