28 April, 2026 | 8:13 PM

మహిళ దారుణ హత్య

28-04-2026 06:32 PM

వివాహేతర సంబంధమే హత్యకు కారణమా...?

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

బాన్సువాడ,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో మహిళ దారుణ హత్య కలకలం రేపింది.  స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. వర్ని మండలం పొట్టిగుట్ట తాండాకు చెందిన కవితకు చందూర్ మండలం మేడిపల్లి తాండాకు చెందిన సంతోష్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. అయితే కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సంతోష్ మృతి చెందడంతో కవిత తన పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.

మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తితో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. ఘటన స్థలంలోనే కవిత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసి ఉంటుందనే కోణంలో  పోలీసు దర్యాప్తు చేపట్టారు.