19-07-2025 01:31:51 AM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ముస్తాబాద్:ఎల్లారెడ్డిపేట, జూలై 18 (విజయక్రాంతి) జిల్లా కేంద్రంలోనిమహిళలు వ్యాపారంలోనూ రాణించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాఆకాంక్షించారు.ఇందిరా మహిళా సంబరాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. జిల్లాలోని ముస్తాబాద్ మండలం ఆవునూరు గాయత్రి గ్రామైక్య సంఘం, ఎల్లారెడ్డిపేటలో చైతన్య గ్రామైక్య సంఘం, కోరుట్లపేటలో భాగ్య శ్రీ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఎరువులు పురుగు మందుల దుకాణాలను ఏర్పాటు చేసి శుక్రవారం వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామని తెలిపారు. త్వరలో రైస్ మిల్లులు, పెట్రోల్ బంక్, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రైతన్నలకు ఉత్తమ సేవలు అందించేలా మహిళా సంఘాలకు ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.
జిల్లాలో మొత్తం 23 దుకాణాలు మహిళా సంఘాల ఆధ్వర్యలో ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ముందుగా మూడు ప్రారంభించామని, ఎరువులు, పురుగు మందుల దుకాణాలు ఏర్పాటు రాష్ట్రంలోనే ప్రథమ ముని వెల్లడించారు మహిళా సంఘాల బాధ్యులు ప్రణాళిక ప్రకారం నిర్వహించి రైతులకు ఉత్తమ సేవలు అందించాలని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులు తమ పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో ఎరువులు విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసి మహిళలకు ఆర్థికంగా మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల బాధ్యులు ఐక్యంగా తమ దుకాణాలను సమర్థవంతంగా నిర్వహించి ఆర్థికంగా మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.