01-08-2025 12:14:40 AM
నాగార్జునసాగర్, జూలై 31 (విజయక్రాంతి): నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 585.10 అడుగులవద్ద నీరు నిల్వ వుంది.
312.0450 టీఎంసీలకుగానూ ప్రస్తుతానికి 297.7235 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి. జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,273 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 8604 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 7110 క్యూసెక్కుల నీటిని, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని, లో లేవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,82,609 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,43,829 క్యూసెక్కులుగా ఉంది.
నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ఎగువన శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో సాగర్ నిండుకుండలా మారి, ఆహ్లాదం పంచుతోంది. ఇటు గేట్ల నుంచి పాలధారల్లా దూకుతున్న కృష్ణమ్మ కనువిందు చేస్తోంది. మరో దిక్కు సాగర్ సమీపంలో ఉన్న ఎత్తిపోతల జలపాతం సందర్శకుల మదిని దోచుకుంటోంది.