24-10-2025 01:29:42 AM
-కొత్తగా నియామకమైన 14 మంది సబ్ రిజిస్ట్రార్లకు సూచన
-కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగాలు
-20 నెలల కాలంలో 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం
-రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : కొత్తగా ఉద్యోగాలలో చేరే అధికా రులు నిజాయితీ, నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయాలని, ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాలని, ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రభుత్వపేరు ప్రతిష్టలను ప్రజల్లో ఇనుమడింపజేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆయన సూచించారు.
గ్రూప్ -2 ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14 మంది అధికారులు గురువారం రాష్ర్ట సచివాలయంలోని మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని మంత్రి అభినందించి, ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత దశాబ్ద కాలంలో నిరుద్యోగ యువత కన్న కలలు కల్లలై పోయాయని, ఉద్యోగాల నియామక ప్రక్రియలలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయని విమర్శించారు.
ఈ పరిస్థితులలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అందువల్లే 20 నెలల పాలనా కాలం లో ఇప్పటి వరకు సుమారు 70 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగిందని వివరించారు. అంతేగాక నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచన మేరకు వివిధ శాఖల తరఫున కార్యాచరణను విస్తృ తం చేశామని మంత్రి పొంగులేటి చెప్పారు. జీపీవోల నియామకం, హౌసింగ్ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 350 మంది ఇంజనీర్లు, సర్వే విభాగంలో 3,465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి రిజిస్ట్రార్ సంతోష్రెడ్డి పాల్గొన్నారు.