19-08-2025 08:11:08 PM
కరీంనగర్,(విజయక్రాంతి): అందమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, వెలకట్టలేని దృశ్యాలను పదికాలాలపాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేదే ఫోటోగ్రఫీ అని బిజెపి నాయకులు- మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ తిరుమల్ నగర్ లోని రవివర్మ స్టూడియోలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా హాజరై... ఫోటో కెమెరా పితామహుడు లూయిస్ డాగెర్ చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేశారు. ఫోటోగ్రాఫర్లను సన్మానించారు.
ఈ సందర్భంగా మాజీ మేయర్ వై.సునీల్ రావు మాట్లాడుతూ... ఆధునిక కాలంలో మానవ జీవితంతో ఫోటోగ్రఫీకి విడదీయలేని బంధం ఉందని తెలిపారు. ఫోటోగ్రఫీ రంగంలో వచ్చిన మార్పులను గుర్తు చేసుకున్నారు. మధురస్మృతులను ఎప్పటికీ జీవితకాలం గుర్తుండేలా చేసేవాళ్ళు, సమాజాన్ని జాగృతం పరిచే వాళ్ళు ఫోటోగ్రాఫర్లని కొనియాడారు. చరిత్రను చాటి చెప్పేది.. చరిత్ర ఆనవాళ్లు కాపాడేది ఫోటోలు మరియు ఫోటోగ్రాఫర్స్ అని అన్నారు. జిల్లాలోని ఫోటో, వీడియో గ్రాఫర్స్ అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేశారు.