19-08-2025 08:39:57 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో సాండ్ బజార్ ను ఏర్పాటు చేసిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కే.ఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, టిజిఎండిసి అధికారులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సాండ్ బజార్ లో నాణ్యమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సాండ్ బజార్ లో అందుబాటులో ఉన్న నాణ్యమైన ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీజీఎండిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాండ్ బజార్ లో వినియోగదారులకు సరిపడే విధంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. సాండ్ బజార్ లో లభించే ఇసుకను తీసుకోవడానికి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రాని వారికి సిబ్బందినే ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసి అందించాలన్నారు.
గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నందున ఆయా గ్రామాలలో ఇసుక అవసరాలను గుర్తించి ఆయా గ్రామాల వద్దకే ఇసుకను తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలను చూడాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఎంతో సహకారం అందిస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ రేట్ లో సాండ్ బజార్ లో ఇసుక లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన ఇసుకను అందించే సాండ్ బజార్ ఏర్పాటుతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు.