17 April, 2026 | 4:49 AM

వైఐఐఆర్ఎస్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

12-01-2026 09:27 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీజీఈడబ్ల్యూఐడీసీ ఎండి గణపతి లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించి పోటీ ప్రపంచంలో నిలబడేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్. సి., ఎస్. టి., బి. సి రెసిడెన్షియల్ పాఠశాలలలా కాకుండా అందరికీ ఒకే చోట ఉమ్మడి కుటుంబంలా సకల సౌకర్యాలతో పాఠశాలలను ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరుగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 79 పాఠశాలలు మంజూరు కాగా 76 పాఠశాలలకు టెండర్లు పూర్తి కాబడి 18 పాఠశాలల్లో పనులు మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతి వారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించాలని, ప్రతి నెలలో కనీసం ఒకసారి పాఠశాలల నిర్మాణాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని తెలిపారు. పాఠశాలలు నిర్మాణంలో ఉన్న చోట పనితీరు పురోగతిపై డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణంపై ప్రత్యేక చొరవ తీసుకొని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యతో పాటు క్రీడలు, సమాజంలో సవాళ్లను ఎదుర్కొనే విధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ తదితర అంశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా, జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం, ఎల్లారెడ్డి నియోజక వర్గంలో లింగం పేట మండలం మోతే గ్రామంలో సంబంధిత పాఠశాలలకు భూమిని కేటాయించడం జరిగిందని, టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు