21-06-2025 11:01:52 PM
ఐటీడీఏ పీవో రాహుల్..
భద్రాచలం (విజయక్రాంతి): ప్రాచీన కాలం నాటి యోగాసనం భారతీయుల అమూల్య సంపదని, దీనిలోని విశేషమైన ఆరోగ్య రహస్యాలు తెలిసిన ప్రపంచ దేశాలన్నీ దీనిని ఆచరించి లబ్ధిపొందుతున్నాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శనివారం నాడు ఉదయం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఐటీడీఏ యూనిట్ అధికారులు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల బాల బాలికలు, ఇతర సిబ్బందితో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతిరోజు మనం చేసే దయానందన కార్యక్రమాలలో నిత్య కృత్యంగా యోగాసనం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గి మెదడుకు శక్తిని ఇస్తుందని, జీవన క్రియలను మెరుగుపరిచి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను దూరం చేస్తుందని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, శ్వాసక్రియను మెరుగుపరిచి శరీరం అంతటికి చక్కటి ప్రాణవాయువుతో కూడిన మెరుగైన రక్తప్రసరణకు తోడ్పడుతుందని, ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ సాంప్రదాయ యోగాని ఆచరించి దాని ఫలితాలు అనుభవించి సుఖవంతమైన, ప్రశాంతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు ప్రతిరోజు క్రమం తప్పకుండా విద్యార్థిని విద్యార్థులకు యోగాసనంలో ముఖ్యమైన ఆసనాలు చేయించి వారి మేధాశక్తిని పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని అన్నారు.
అనంతరం భద్రాచలం శాసనసభ్యులు తెల్లంవెంకటరావు మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన చేస్తే మానసికంగా ఆరోగ్యంగా ఎంతో ఉత్తేజంగా ఉంటామని, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని ఎంతో ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూరుస్తుందని, శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులకు ఉన్నటువంటి ఒత్తిడిని ఆందోళనను తగ్గించి నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకు వస్తుందని అన్నారు. అనంతరం యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ మాట్లాడుతూ... ఆరోగ్యంగా లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడని, శాంతంగా ఉన్న వారే జీవితంలో ఏమైనా సాధించగలరని, యోగా అనేది మన మనసుకు మన ఆత్మని శరీరాన్ని ఏకం చేసే ఒక మహోన్నత సాధనం అని, పాఠశాలల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే మీ యొక్క మేధాశక్తి నైపుణ్యాలు పెరిగి ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకుంటారని అన్నారు.
అనంతరం యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ అందరి చేత వివిధ భంగిమలలో యోగాసనాలు చేయించారు. అనంతరం ఐటీడీఏ పీవో బి రాహుల్ సిబ్బంది సమక్షంలో భద్రాచలం శాసనసభ్యులు తేల్లం వెంకటరావును, యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఒ సున్నం రాంబాబు, ఎస్ ఓ భాస్కరన్, ఏ టి డి ఓ అశోక్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, జి సి డి ఓ అలివేలు మంగతాయారు, ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఆశ్రమ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.