ఎన్నారైలతో పెళ్లంటూ యువతులకు వల
- ఇన్స్టాగ్రామ్ వేదికగా టోకరా
- రూ.12 లక్షల నగదు, తులం బంగారం కాజేత
- పోలీసుల అదుపులో నిందితుడు
మెదక్, జూన్ 19 (విజయక్రాంతి): ఎన్ఆర్ఐలతో పెళ్లి జరిపిస్తామని ముగ్గురు యువతులను ఇన్స్టాగ్రామ్ వేదికగా నమ్మించి రూ.12 లక్షల నగదు, తులం బంగారం టోకరా వేసిన ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలోని టెక్మాల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఓ యువతి, ఇద్దరు బాలికలకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి దుర్గేష్ పరిచయమయ్యాడు.
ఇదే క్రమంలో హైదరాబాద్ కమిషనర్ సుమతి కుమారుడు తన స్నేహితుడని, అతడి స్నేహితులు విదేశాల్లో స్థిరపడ్డారని యువతులను నమ్మించాడు. ముగ్గురు బాలికల్లో ఇద్దరికి ఫారిన్ కుర్రాళ్లతో పెళ్లి సంబంధం కుదురిస్తానని, మరో అమ్మాయికి కానిస్టేబుల్ తో వివాహం జరిపిస్తానని ఆశ పెట్టి వారి నుంచి రూ.12 లక్షల నగదు, తులం బంగారం కాజేశాడు.
ఆ తర్వాత దుర్గేష్ నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడం, ఇన్స్టాగ్రామ్లో స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధిత యువతులు తల్లిదండ్రులతో కలిసి మంగళవారం టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రూ.ఆరు లక్షలకు కుదిరిన ఒప్పందం!
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చకుండా పెద్దల సమక్షంలో పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.6 లక్షలకు ఒప్పందం కుదిరిచ్చినట్లు తెలుస్తుంది. అయితే మిగతా రూ.6 లక్షలు, తులం బంగారం ఏమయ్యాయనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పంచాయతీ పెద్దలు, పోలీసులకు వాటాల పంపకాలు జరిగినట్లు స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.






