calender_icon.png 26 June, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకుడు ప్రశాంత్

26-06-2025 01:12:07 AM

సిద్దిపేట, జూన్ 25 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ పాటిల్, మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జిల్లా నాయకుడు జైపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు విఠల్, పలు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ 18 నెలల పాలనలో ప్రజలకు మోసం చేసింది.

రైతుబంధు నిలిపివేసి, బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను దెబ్బతీశారు. సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు అబద్ధాల పోటీ జరుగుతోంది. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలి,‘ అని తీవ్రంగా విమర్శించారు. రైతుబంధు సృష్టికర్త కేసీఆర్ కాలంలో ఎరువుల కొరత లేదు, విత్తనాల కష్టాలు లేవు.

కాంగ్రెస్ పాలనలో మాత్రం రైతులకు నష్టమే జరిగింది. అసెంబ్లీ పెట్టగల సాహసం కూడా కాంగ్రెస్కు లేదని ఆయన ధ్వజమెత్తారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని బి ఆర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. కార్యకర్తలందరూ ఐక్యతగా పని చేయాలి అంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు. 

  1. నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన హరీష్ రావు
  2. కాంగ్రెస్, బీజేపీ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణ

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం పరిశీలించారు. రూ.300 కోట్లతో ఏసియా ఖండంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తున్న ఈ ప్యాక్టరీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం తాలూకు రైతు అనుకూల విధానాలకు నిదర్శనమని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగర్ నుంచి ప్రతి సంవత్సరం 10 కోట్ల లీటర్ల నీరు.

ఈ ప్రాజెక్టుకు అందిస్తున్నామని, ప్యాక్టరీ ప్రారంభమైతే రైతులకు పెద్ద ఎత్తున ఆదాయం, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. కేంద్రంలోని బీజేపీ  ప్రభుత్వం మూడు నల్ల చట్టాలతో రైతులను ఉక్కిరి బిక్కిరి చేసి, ఆయిల్ దిగుమతులపై సుంకం తగ్గించి రైతులకు నష్టం చేస్తుందన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వెంటనే చెల్లించాలని, రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్కు టెండర్లు పిలిచి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎక్కడా ఆయిల్ పామ్ సాగు చేపట్టలేదని, రైతుల పట్ల నిర్లక్ష్యమే చూపుతోందని విమర్శించారు. ప్యాక్టరీ ప్రారంభం ఆగస్ట్ రెండో వారంలో జరుగుతుందని, ఇది ఈ ప్రాంతానికి ఒక వరంగా నిలుస్తుందని హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అకాల మరణాలు పొందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలనుంచి ఓదార్చారు.