calender_icon.png 2 June, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత పారిశ్రామిక రంగాల వైపు ఆసక్తి చూపాలి

31-05-2025 10:48:34 PM

గ్రామీణ అభివృద్ధికి ఇటుక తయారీ యూనిట్లు దోహదపడతాయి..

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని యువత పారిశ్రామిక రంగాల వైపు ఆసక్తి చూపాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(District Collector Badawat Santosh) అన్నారు. జిల్లాలో తక్కువ పెట్టుబడితో స్థిర ఆదాయాన్ని సాధించగల సిమెంట్ మట్టి ఇటుకల తయారీ యూనిట్లు గ్రామీణ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. శనివారం కొల్లాపూర్ సమీపంలో నెలకొల్పిన సిమెంట్ ఇటుక యూనిట్ తయారీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా యూనిట్లలో జరుగుతున్న తయారీ ప్రక్రియలను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడుతూ, తయారీ పద్ధతులు, నాణ్యత, రోజువారీ ఉత్పత్తి, లాభ నష్టాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

కలెక్టర్ మాట్లాడుతూ... ఇటుకల తయారీ యూనిట్లు భవన నిర్మాణ రంగానికి ప్రాధాన్యత కలిగించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కూడా పెంచుతాయని అన్నారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, సుస్థిరంగా నడిపితే ఇది మంచి ఆదాయ మార్గంగా మారుతుందన్నారు. ఇటుక తయారీ పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి రుణ సౌకర్యాలు, సబ్సిడీలు లభిస్తున్నాయని తెలిపారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక రంగంలోకి అడుగుపెడితే, ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారని తెలిపారు. వారి వెంట కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ అమరేందర్, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్ తదితర అధికారులు పాల్గొన్నారు.