వాస్తవికత దిశగా జెన్ జీ
డా.ఎర్రోజు శ్రీనివాస్ :
ప్రతి తరంలో ఒక గొప్ప రాజకీయ చైతన్యం ఉంటుంది. ఆ రాజకీయ చైతన్యంలోకి యువత వచ్చినప్పుడు గొప్ప గొప్ప వాగ్దానాలు వారిపై పనిచేయడం ఆగిపోతాయి. దశాబ్దాలుగా, సాంప్రదాయ రాజకీయ యంత్రాంగం ఒక నిర్దిష్టమైన సూత్రాన్ని నమ్ముకుంటూ వచ్చింది. యువతకు విస్తృతమైన వాగ్దానాలు చేయడం, వాటికి భావోద్వేగాల రంగు పులమడం వరకే వారిని వాడుకొని అధికారంలోకి రావడమనేది సర్వసాధారణంగా జరిగిపోయింది.
యువతను అధికార సోపానాలుగా వాడుకొని, తమ వంతు కోసం వారు వేచిచూడాలనే సూత్రం ఇప్పుడు పనిచేయదేమో. హాస్యపూరిత, వెటకారానికి, నిర్లక్ష్యానికి స్పందనగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు యువతలో కొత్త ఆలోచనలను, భవిష్యత్తు పట్ల ఆశలను చిగురింపజేసింది. ఆవిర్భావం ఒక వైరల్ క్షణ మాత్రంగా మిగిలిపోకుండా యువత అధికారాన్ని, జవాబుదారీతనాన్ని, ప్రభుత్వాన్ని ఎలా చూస్తున్నారో చెప్పే ఒక ప్రాథమిక మార్పునకు ఇది నిదర్శనంగా నిలబడింది.
జూలై 20న పార్లమెంట్ ముట్టడికి వాళ్లు ఇచ్చిన పిలుపు, వచ్చిన స్పందనను పరిశీలిస్తే యువతలో ఎంత అసహనం పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారం కాకూడదని సాగుతున్న ఈ నిరంతర పోరాటం యువత బలమైన దిక్కార ప్రదర్శనకు సాక్ష్యంగా నిలబడింది. యువత ఆలోచనా విధానం పూర్తిగా వాస్తవికత వైపు మళ్లింది. అమూర్త భావజాల నాటకం దాటి ముందుకుసాగుతున్నది.
చాలా కాలంగా, మన రాజకీయ చర్చల్లో విధేయత చూపడమంటే అమూర్త భావజాలాల నిరంతర యుద్ధంలో ఒకవైపు నిలబడటమే కదా. ఆయా పార్టీల విధానాలు రోజువారీ జీవితంలో ఎలాంటి స్పష్టమైన ఫలితాలను అందించినా, అందించకపోయినా, మీరు ఆ పార్టీ ప్యాకేజీని సంపూర్ణంగా అంగీకరించాల్సిందే. సాంప్రదాయ రాజకీయం అంతా గొప్ప వాగ్దానాలు, భావోద్వేగ విజ్ఞప్తులు, జీవితకాల పార్టీ విధేయతపైనే ఆధారపడింది.
జెన్-జీ, మిలీనియల్స్ ఆ సూత్రాన్ని పట్టించుకోవడం లేదు. ఆర్థిక అస్థిరత, సమాచార విప్లవం మధ్య పెరిగిన వారు సంక్లిష్టతను తట్టుకునే శక్తిని, పనికిరాని విషయాలను సహించని స్థితికి చేరారు. ఈ వాస్తవిక మార్పు భావోద్వేగ ప్రసంగాల కంటే నిర్దిష్ట విధానాల ఫలితాలకే ప్రాధాన్యతనిస్తుంది, వ్యవస్థాగత జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తుంది. యువత ఆన్లైన్లో ఏకమైనా, జంతర్ మంతర్ దగ్గర గుమిగూడినా వారు అసలు ఏమి డిమాండ్ చేస్తున్నారో గమనిస్తే, ఆ విధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఊహాజనిత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు; వ్యవస్థ సరిగ్గా పనిచేయాలని కోరుకుంటున్నారు. విద్య, పరీక్షల పారదర్శకత మీద నిరంతరంగా వారు చేస్తున్న పోరాటం దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నది. ఆర్థిక వాస్తవికతలపై విద్యావంతులైన యువత చర్చిస్తున్నది. జీడీపీ గణాంకాలే కాకుండా, అల్ప ఉపాధి, గిగ్- ఎకానమీ భద్రత, ఒక డిగ్రీ కనీస జీవనోపాధికి హామీ ఇస్తుందా, లేదా అనే అంశాలపైకి వారి దృష్టి మళ్లింది.
ఈ ఉద్యమంలో స్వీయ-పరిహాసం, మీమ్ సంస్కృతిని ఉపయోగించడాన్ని పాతతరం రాజకీయ విశ్లేషకులు తీవ్రత లేకపోవడంగా పొరబడుతుంటారు. నిజానికి, వాస్తవికవాదికి వ్యంగ్యమే అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఈ యువ చైతన్యాన్ని కొన్ని యువజన నినాదాలు, డిజిటల్ ప్రచారాలు లేదా నామమాత్రపు ప్రాతినిధ్యంతో లొంగదీసుకోవచ్చన్నది పొరపాటే. ఆ ఆలోచన ఈ కాలాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతోంది.
ఈనాటి తరం అనుసరించడానికి ఒక ఆకర్షణీయమైన నాయకుడి కోసం వెతకడం లేదు; వారు రాజకీయ పార్టీలను సేవలు అందించే సంస్థలుగా చూస్తున్నారు. యువ ఓటర్లలో పెరుగుతున్న ఈ వాస్తవిక, సమస్యల కోణంలో ఆలోచించే విధానం ఒక తాత్కాలిక ట్రెండ్ కాదు. విధానం లేని ఉద్వేగం వ్యర్థమని గ్రహించిన ఒక తరం సహజమైన స్పందన ఇది.
వ్యవస్థకు అందుతున్న సందేశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. అదేమంటే అబద్దాలతో ఎంతో కాలం నెట్టుకురావడం కుదరదు. అవాస్తవాలను మెదడులో నింపి యువత ఆలోచనలు కట్టడి చేస్తామంటే అది వారి భ్రమే. మాటలు చెప్పే కాలం చెల్లిపోయింది. ఇకనైనా పనిచేసి చూపించడం ప్రారంభించండి.
వ్యాసకర్త: తెలంగాణ అధ్యయన
సమాలోచన కేంద్రం (టాస్క్) అధ్యక్షుడు






