15-06-2025 12:41:00 PM
హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో(Sri Lakshmi Narasimha Swamy Temple) ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ప్రసాదం కౌంటర్ల వద్ద భారీ క్యూలైన్లు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు.
వరసగా శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో యాదగిరిగుట్టకు(Yadagirigutta) భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, ఇతర ప్రాంతాాల భక్తులు తరలిరావడంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ పరిసరాలు, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, మాడ వీధులు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నామని ఆలయ అధికారులు ప్రకటించారు. యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తులకు ప్రతిరోజు ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.