16-12-2025 02:21:16 AM
కమ్యూనిటీ హెల్త్ ఎడ్యుకేషన్ను ప్రారంభించిన స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్
హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మొబైల్ స్క్రీన్లు, సోషల్ మీడియా స్క్రోలింగ్, ఆన్లైన్ ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా వస్తున్న అపారమైన ఆరోగ్య సమాచారంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారని, నిజమైన, విశ్వసనీయమైన వైద్య సమాచారాన్ని గుర్తించేందుకు స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నానక్రామ్గూడలో “స్టార్ చాయ్ పే చర్చా” అనే వినూత్న కమ్యూనిటీ హెల్త్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిజిటల్ స్క్రీన్లకు విరామం ఇచ్చి, వైద్య నిపుణులతో నేరుగా ముఖాముఖి సంభాషణ జరిపేలా రూపొందించిన ఈ కార్యక్రమం, ఆరోగ్యంపై విలువైన, నమ్మకమైన చర్చలకు వేదికగా నిలుస్తుంది.
సీనియర్ డాక్టర్లతో చర్చిస్తూ ఆరోగ్య అంశాలపై అవగాహన పొందే అవకాశాన్ని ఇది అందిస్తోంది. ఈ సందర్భంగా డా. భరత్ కుమార్ నారా మాట్లాడుతూ.. “సమాజ స్థాయిలో ఆరోగ్య అవగాహన ఇప్పుడు ఐచ్చికం కాదు, అత్యవసరం. ఆన్లైన్లో అధిక సమాచారం వల్ల ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ‘చాయ్ పే చర్చా’ వంటి కార్యక్రమాలు ప్రజలను స్క్రీన్ల నుంచి దూరం చేసి, అర్థవంతమైన సంభాషణల ద్వారా సరైన ఆరోగ్య నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన రెసిడెన్షియల్ సొసైటీ ప్రతినిధులు ఒక ప్యానెల్గా పాల్గొని, స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడకు చెందిన వైద్య నిపుణులతో చర్చలు నిర్వహించారు. సీనియర్ కన్సల్టెంట్లు ప్రజల సందేహాలకు సమాధానాలు ఇచ్చి, రోజువారీ జీవనశైలికి అనుకూలమైన ఆరోగ్య సూచనలు అందించారు.
ప్రెస్టీజ్ ట్రాంక్విల్ నుంచి మిస్ హర్షితా సంకటి, మిస్ కావ్య మణియం చంద్రశేఖర్, మిస్టర్ సంజేష్ గుప్తా వంకదారు, మిస్టర్ నారాయణ స్వామి పాల్గొని, తమ అనుభవాలు, సమాజంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను పంచుకున్నారు. కార్యక్రమంలో డా. భరత్ కుమార్ నారా, సీనియర్ కన్సల్టెంట్, హెడ్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, డా. అభిరామ్ కొగంటి, సీనియర్ కన్సల్టెంట్, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెపటాలజీ, డా. శరత్ చంద్ర గొరంట్ల, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ పాల్గొన్నారు.