31-07-2025 12:00:00 AM
సంగారెడ్డి, జూలై 30(విజయక్రాంతి): జిల్లాలో చాలా మంది వైద్యులు సమయపాలన పాటించక, ఇష్టానుసారంగా విధులు నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని గుర్తించిన ప్రభుత్వం వైద్యులు, సిబ్బందికి ఆధార్ బేస్డ్ అటెండెన్స్ అమలుకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే ఆయా పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లలో పనిచేసే వైద్యులు, సిబ్బంది వివరాలను ఆ శాఖ అధికారులు సేకరించారు. ఆధార్ నంబర్ తో పాటు సెల్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ ప్రక్రియపై ఉద్యోగులకు శిక్షణ సైతం ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 1 నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరో గ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, ఏరియా ఆస్పత్రులు, సబ్ సెంటర్లలో చాలా మంది వైద్యులు, సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు తనిఖీ చేసిన సమయంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడాన్ని ప్రభుత్వం గమనించింది.
జిల్లాలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఆయా పీహెచ్సీలకు వచ్చినప్పుడు వైద్యులు లేకపోవడంతో గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రులు, జిల్లా కేంద్రం ఆసుపత్రిలో సేవల కోసం వస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు సైతం పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్పులు, కింది స్థాయి సిబ్బందితోనే నామమాత్రంగా వైద్యసేవలు అందిస్తున్నారు.
ఇలాంటి వాటికి ఆధార్ బేస్డ్ అటెండెన్స్ చెక్ పెట్టనుంది. కోవిడ్ కు ముందు జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో బయోమెట్రిక్ హాజరు అమలులో ఉండేది. వివిధ కారణాలతో అవి మూలనపడ్డాయి. విధానం అమలులో ఉన్నప్పటికీ చాలా మంది తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఆయా పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులు కొందరు ప్రైవేట్ క్లినిక్లు ఏర్పాటు చేస్తూ మధ్యాహ్నమే ఇంటి ముఖం పడుతున్నారు.
ఈ ఆధార్ బేస్డ్ అటెండెన్స్తో వీరి ఆగడాలు బయటపడనున్నాయి. సెల్ ఫోన్లలో ఫేషియల్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు వేయాల్సి ఉంటుంది. పీహెచ్సీకి 50 మీటర్ల దూరం నుంచి ఈ యాప్ పని చేస్తుంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారితో పాటు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులకు ఈ యాప్ అనుసంధానం ఉంటుంది. ఎప్పటికప్పుడు వివరాలు వారికి అందుతాయి. హాజరు వేసిన వైద్యుల లోకేషన్ షేర్ అవుతుంది.
ఏ సమయానికి వచ్చారు.. ఏ సమయానికి వెళ్తున్నారు.. నెలలో ఎన్నిసార్లు రావడం లేదనే విషయాలు తెలుస్తాయి, వీటి ఆధారంగానే వేతనాలు చెల్లిస్తారని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విధానం సక్రమంగా అమలైతే రోగులకు మరింత నాణ్యమైన సేవలు అందే అవకాశం ఉంటుంది. అలాగే సిబ్బంది సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.
ఆగస్టు 1 నుంచి అమలు...
జిల్లాలోని ఆయా ఆస్పత్రుల్లో ఆధార్ ఆధారిత హాజరు విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని వైద్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్త్ ఆదేశాలు జారీ చేశారు. డీఎంహెచ్వో పరిధిలోని ఆస్పత్రులతో పాటు ఆయూష్ కేంద్రాల్లో అమలు కానుంది.
ఇందుకు సంబంధించి తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ అభివృ ద్ది చేసిన మొబైల్ ఫేషియల్ అథెంటిక్ సిస్టమ్ ను అమలు చేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఈ విధానం అమలు చేస్తుండగా, అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.