05-06-2025 12:28:31 AM
హైదరాబాద్, జూన్ 4: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫాల్కన్ గ్రూప్ (క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్) మోసం కేసులో తెలంగాణ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సందీప్ కుమార్ను సీఐడీ అరెస్ట్ చేసింది. అతడి నుంచి రూ.2.5 కోట్ల విలువైన 3 కార్లు, 14 స్థిరాస్తి పత్రాలు, 3 సెల్ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సందీప్ ఖాతాల్లో రూ.8 కోట్ల నగదు ఉన్నట్టు గుర్తించారు. ‘ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం’ పేరిట నిందితులు దేశవ్యాప్తంగా బాధితుల నుంచి రూ.4,215 కోట్లు వసూలు చేసిన విషయం విధితమే. ఏపీ, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ్బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఫాల్కన్ డైరెక్టర్లపై కేసులు నమోదయ్యాయి. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడింది.
ఒక్క హైదరాబాద్లోనే ఫాల్కన్ సంస్థ రూ.850 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది. బ్రిటానియా, గోద్రెజ్, అమెజాన్ వంటి సంస్థల్లో పెట్టబడుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఫాల్కన్కు అనుబంధంగా 14 సంస్థలు ఏర్పాటు చేసిన వసూళ్లు చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన సందీప్కుమార్ పరారీలో ఉండగా, అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా సీఐడీ పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు.