ప్లీ బార్గెనింగ్కు కొత్త విధానం
అటార్నీ జనరల్ వెంకటరమణి
హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ఓపి జిందాల్ గ్లోబల్ యూనివివర్సిటీ, నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన ‘డెలివరింగ్ జస్టిస్ ఇన్ టైమ్: గ్లోబల్ ప్రాక్టీసెస్ అండ్ ఇండియన్ ఎక్స్పీరియెన్సెస్’ సదస్సులో భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లీ బార్గెనింగ్కు జాతీయ స్థాయిలో స్పష్టమైన ప్రోటోకాల్ అవసరమని, ఇది న్యాయ వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను పెంచుతుందని తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరును అంచనా వేసేందుకు “లీగల్ హెల్త్ ఇండెక్స్” రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ఈ బాధ్యతను న్యాయ విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ డా అభిషేక్ సింగ్వీ మాట్లాడుతూ.. దేశంలో పెండింగ్ కేసుల సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. యాక్సెస్, బ్యాక్లాగ్, ఖర్చు, ఆలస్యం వంటి సమస్యలను పరిష్కరించాలంటే న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, మధ్యవర్తిత్వ వ్యవస్థ బలోపేతం, గ్రామ న్యాయాలయాల పునరుద్ధరణ అవసరమని తెలిపారు. ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సి రాజ్ కుమార్ దేశంలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎస్. బజ్పాయి మాట్లాడుతూ వేగం మాత్రమే న్యాయం కాదని, పారదర్శకత, నిష్పాక్షికతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.




