రుణాల పేరిట మోసగిస్తున్న వ్యక్తి అరెస్ట్
కూకట్పల్లి, జూన్ 7, విజయ క్రాంతి : వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులపాలై పలు ప్రైవేట్ సంస్థల్లో లోన్లు ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన సంఘటనలో ఓ వ్యక్తిని కెపిహెచ్బి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కెపిహెచ్బి కాలనీ మూడవ రోడ్డులో నివాసం ఉంటున్న గాల శ్రీనివాస్ బాబు ఐస్క్రీమ్, మిల్క్ డిస్ట్రిబ్యూటర్గా బండ్ల ద్వారా వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతని వద్దకు వచ్చి పరిచయం ఏర్పడిన వారితో వివిధ సంస్థల్లో లోన్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని ఆయా సంస్థల్లో లోన్ పొందడం కోసం దరఖాస్తు చేయించేవాడు.
లోన్ కేటాయించిన అనంతరం వాటికి సంబంధించిన వస్తువులను బాధితులకు ఇవ్వకుండా తాను మరొకరికి విక్రయించేవాడు. ఈఎంఐ బాధితులు కట్టేటట్టుగా వారికి ఎక్కువ మొత్తంలో వడ్డీలు ఇప్పించేటట్లుగా వారి వద్ద నుంచి నగదు తీసుకొని నమ్మించేవాడు. సుమారు 30మంది బాధితుల వద్ద నుంచి లక్షల్లో నగదు వసూలు చేసాడు. తాము మోసపోయినట్లుగా గ్రహించిన బాధితులు కెపిహెచ్బి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసు బాబు సైతం తనను వ్యాపారం చేసుకోకుండా చంపేస్తానని బాధితులు బెదిరిస్తు న్నట్లు పోలీసులకు తెలిపాడు. అప్పులు చేసిన మాట వాస్తవమే అని పోలీసులతో పేర్కొన్నాడు. అయితే ఎవరి వద్ద ఎంత నగదు ఎంత వడ్డీ తీసుకున్నాడో విచారణ చేసి శ్రీనివాస్పై చర్యలు తీసుకుంటామని కెపిహెచ్బి పోలీసులు తెలిపారు.






