12-12-2025 12:00:00 AM
కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ నాగ చంద్రిక దేవి
ఖైరతాబాద్, డిసెంబర్ 1౧ (విజయక్రాంతి): వృద్ధాప్యంతో బాధపడుతూ నిలువ నీడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులకు మూడు చింతలపల్లి ప్రేమ నిలయం వృద్ధాశ్రమం ఆసరా కానున్నదని కిన్నెర వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ నాగ చంద్రిక దేవి తెలిపారు. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగేశ్వరరావు, ఇందిరా రెడ్డి, శిల్పా, బెనారస్ బాబుతో కలిసి మాట్లాడారు.
గత 20 ఏళ్లుగా తమ సొసైటీ ద్వారా అనాధ శవాలకు అంత్యక్రియలు చేయడంతో పాటు వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు చెప్పారు. తమ సేవ కార్యక్రమాలను తెలుసుకున్న మై హోమ్ రామేశ్వర రావు మూడు చింతలపల్లిలో అర ఎకరం స్థలం తో పాటు రెండు కోట్ల రూపాయల విరాళంగా అందించారని చెప్పారు.
ఆయన ఇచ్చిన విరాళం తో 100 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించేలా భవనాలను నిర్మించినట్లు చెప్పారు. సదరు భవనాన్ని జనవరి 1న చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దాతలు సహకరిస్తే తమ సొసైటీ ద్వారా భవిష్యత్తులో సేవ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.