20-02-2026 12:06:06 AM
ముషీరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో దొంగతనం జరిగిందని కట్టు కథ అల్లిన ఓ యువకుడిని చిక్కడపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, గోల్ లోన్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
చిక్కడపల్లి ఏసీబీ ఎల్. రమేష్ కుమార్ ఇన్స్పెక్టర్ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి అలేఖ్య ఎస్టేట్కు చెందిన భాస్కర్ ప్రమోద్ ముల (32) తన కుటుంబ సభ్యుల బంగారాన్ని తానే దొంగిలించి, గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధతో 80 గ్రాముల బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నగదు పొందినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
అన్నయ్య పెళ్లి నేపథ్యంలో విషయం బయటపడుతుందనే భయంతో ఫిబ్రవరి 9న తన పెంట్హౌస్లో దొంగ తనం జరిగినట్లు సీన్ సృష్టించినట్టు పోలీసులు వెల్లడించారు. విచారణలో నిజం వెలుగుచూడగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు వారు తెలిపారు.