25 April, 2026 | 10:01 PM

కేంద్రం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

25-04-2026 08:38 PM

- పనిచేస్తూ ప్రమాదంలో మరణించిన హమాలీలకు రూ. 25 లక్షల నష్టపరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి

మంచిర్యాల,(విజయక్రాంతి): కేంద్రం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుమాస ప్రకాష్ కోరారు. శని వారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హరిత ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న మంచిర్యాల జిల్లా రైస్ మిల్ హమాలి యూనియన్ (CITU) మహాసభలో ఉద్యోగ సంఘాల జిల్లా సమన్వయకర్త రంగు రాజేశంతో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికులను బానిసలుగా మార్చి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి అమలు చేసేందుకు పూనుకుందన్నారు.

ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేస్తూ హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 50 సంవత్సరాల పైబడిన హమాలీలకు నెలకు రూ. 9 వేల పెన్షన్ ఇవ్వాలని, అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రత చట్టం తీసుకురావాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న రా రైస్ మిల్లు, బాయిల్డ్  రైస్ మిల్లు, రవ్వ మిల్లు, బ్రేడ్ కంపెనీ, గోడౌన్స్, బేవరేజ్, మార్కెట్ యార్డ్, గ్రామీణ హమాలీలు తదితర రంగాల్లో ఎగుమతి, దిగుమతులు చేస్తూ తమ రక్తాన్ని చెమటగా మార్చి సరుకుల ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తు, ఇంత చాకిరి చేస్తున్న హమాలీలకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ బోనస్ వంటి చట్టబద్ధ హక్కులు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు.

ఇప్పటికైనా నమాలీలకు ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ప్రమాద బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హమాలీలు ఇల్లు కట్టుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, పనిచేస్తూ ప్రమాదంలో మరణించిన హమాలీలకు రూ. 25 లక్షలు ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ మందమర్రి బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి, సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్, DYFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజ్ కుమార్, మహేష్, SFI జిల్లా కన్వీనర్ దాగం శ్రీకాంత్, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, PNM జిల్లా అధ్యక్షులు పాగిడి కిషన్, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భానుమతి, రాజమణి, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.